హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటలపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణిలోని 11 రీజియన్లలో శనివారం మాజీ మంత్రి దిష్టిబొమ్మలను దహనంచేశారు. కవిత గౌరవాధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాతే చరిత్రలో తొలిసారి కార్మికులకు 60కి పైగా హక్కులను సాధించారని గుర్తుచేశారు. పెండింగ్లో ఉన్న డిపెండెంట్లకు 3,400 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, కారుణ్య నియామకాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, ఎక్సటర్నల్ నోటిఫికేషన్ల ద్వారా 4,500 పైచిలుకు ఉద్యోగాలు, విద్యుత్తు చార్జీల రద్దు, ఉచిత ఏసీ కనెక్షన్లు ఇలా ఎన్నో హక్కులను ఎమ్మెల్సీ కవిత సారథ్యంలో సాధించుకున్నామని కార్మికులు గుర్తుచేశారు. 2014లో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఆమె ఉండాలని కార్మికులు పలుమార్లు కోరారని, ఆరు నెలల క్రితం కూడా టీబీజీకేఎస్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా కార్మికవర్గం, కార్యకర్తలంతా ఎమ్మెల్సీ కవితనే గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకొన్నామని స్పష్టంచేశారు. 20 ఏండ్లు టీఆర్ఎస్ ద్వారా అనేక పదవులు అనుభవించిన ఈటల.. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్: టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై ఈటల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో టీబీజీకేఎస్ నాయకులు ఈటల దిష్టిబొమ్మను దహనంచేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల సమీపంలో కోల్బెల్ట్ రహదారిపై, ఆసిఫాబాద్ జిల్లాలోని గోలేటిలోని తెలంగాణ భవన్ వద్ద ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు. భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు మణుగూరు, ఇల్లెందు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో శనివారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీఆర్ఎస్) కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు.