హుజూరాబాద్/జమ్మికుంట, సెప్టెంబర్ 5: సానుభూతి కోసం ఈటల రాజేందర్ డ్రామాలు ఆడుతున్నారని.. మొసలి కన్నీరు కార్చేవారిని ప్రజలు నమ్మొద్దని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. నిరంతరం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి పట్టంగట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో రెడ్డి సంఘం, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం, ట్రస్మా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రైవేట్ టీచర్ల సన్మాన కార్యక్రమం, జమ్మికుంటలో రైతుబంధు సమితి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఆయా చోట్ల హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విధానాల తో దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని ఆరోపించారు. కేంద్రం అనాలోచితన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కేంటే వెనుకబడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గెలిస్తే ఆయన ఒక్కరికే లాభమని, టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. హుజూరాబాద్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అగ్రవర్ణ కులాల్లోనూ పేదలు ఉన్నారని, కులమతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రైవేట్ టీచర్లకు డబుల్ బెడ్రూంఇండ్లు కట్టించే బాధ్యత తనదేనన్నారు.
1800 కోట్లతో వ్యవసాయ యంత్రాలు
1800 కోట్లతో నాటువేసే, వరికోసే యంత్రాలను సబ్సిడీపై అందజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. యంత్రాలతో నిరుద్యోగులకు కొంతమేర ఉపాధి దొరుకుతుందని, వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రి మహమూద్ అలీ
సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది అని, ఆయన మతసామరస్యతను కాపాడుతున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి జమ్మికుంటలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్తో కలిసి ఆయన హాజరయ్యారు. హోంమంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని అన్నారు.
అబద్ధాలను పటాపంచలు చేశాం: మంత్రి కొప్పుల
బీజేపీ అబద్ధాలను పటాపంచలు చేశామని, దళితబంధు ప్రతి కుటుంబానికి అందించామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లకు సహాయం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి, ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ గొడుగులను చింపేసిన దళితులు
ఈటల రాజేందర్పై జమ్మికుంటలో దళిత యువకులు కన్నెర్ర చేశారు. ఈటలకు సంబంధించిన గోడ గడియారాలను పగులగొట్టి.. గొడుగులను చింపేశారు. అంతకుముందు రెండు వేల మంది దండులా కదిలివచ్చి, స్థానిక ఎంపీఆర్ గార్డెన్లో సమావేశమై మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పలువురు దళిత యువకులు సభలో మాట్లాడుతూనే గోడ గడియారాలను, గొడుగులను చూపెట్టారు. వీటిని పంపిణీ చేయాలంటూ ఈటల తమను ప్రోత్సహించాడని పేర్కొన్నారు. దళిత కాలనీల్లో తిరుగుతూ దళితబంధు రాదంటూ అసత్య ప్రచారాలకు పురిగొల్పినట్టు చెప్పారు. ఈటల తమను పావులా వాడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.