నల్లగొండ, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మునుగోడు టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అంతా ఒకచోట చేరి ఆత్మీయ పలుకరింపులు, యోగక్షేమాలు తెలుసుకోవడంతో సభా ప్రాంగణం ఆద్యంతం సందడిగా కనిపించింది. శుక్రవారం మునుగోడులో నిర్వహించిన సమ్మేళనానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీతో ముందుకు సాగారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చారు.
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం కోసమే మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ కుట్ర చేసిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మోదీని ఢీ కొట్టే సత్తా ఒక్క కేసీఆర్కే ఉన్నదన్నారు. ఆయన దేశం మొత్తం తిరగకుండా రాష్ట్రంలోనే అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టాన్ని సాధించిన నేతగా, అనతికాలంలోనే అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన పాలకుడిగా కేసీఆర్ను దేశ ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ వంటి పథకాలన్నింటినీ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ ఇలాంటి పథకాలను కోరుకొంటున్నారని, వీటిన్నింటికీ కారణమైన కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మోదీ, అమిత్షా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. దొంగలను తమ పంచన చేర్చుకొని కుట్రలకు తెరలేపుతున్నారని, అలాంటి కుట్రలో భాగమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఉదంతమని చెప్పారు. మునుగోడులో 70 వేల మంది టీఆర్ఎస్ సభ్యులు ఉన్నారని, టీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. సమ్మేళనం లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే లు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
నిజాలు మాట్లాడితే రాద్ధాంతమా?
నిజాలు మాట్లాడితే రాద్ధాంతం చేస్తారా? అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి బీజేపీ నాయకులపై మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని సింగిల్విండో కార్యాలయంలో నిర్మిస్తున్న 750 టన్నుల గోదాం, ప్రహరీ పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి రైతాంగానికి సీఎం కేసీఆర్ అందజేస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడుతుండగా బీజేపీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రూ.2, 3 వేల ఆసరా పింఛన్ అందిస్తుంటే గుజరాత్లో కేవలం రూ. 600 ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణకు తీవ్ర అన్యా యం చేస్తున్న బీజేపీకి అమ్ముడుపోయిన వారికి ప్రశ్నించే హక్కు లేదన్నారు. గుజరాత్లో రైతుల మోటర్లకు మీటర్లు పెట్టి ముక్కుపిండి విద్యుత్తు చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వారిని నిలదీసి రైతులకు నిజాలు చెప్పడంతో బీజేపీకి చెందిన సింగిల్విండో డైరెక్టర్లు జారుకున్నారు.