హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): వినూత్న పారిశ్రామిక విధానాలతో పెట్టుబలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణకు మరో భారీ పెట్టుబడి తరలివస్తున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్లో దేశంలోనే అతిపెద్ద సంస్థగా పేరుగాంచిన అటెరో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కంపెనీ రాకతో ప్రత్యక్షంగా 300 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న అటెరో ఇండియా బ్యాటరీలను సైతం రీసైక్లింగ్ చేస్తున్నది. భారత్తోపాటు అమెరికా, పోలెండ్, ఇండోనేషియాలో సైతం ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. 2027 నాటికి ఏటా 3 లక్షల టన్నుల లిథియం అయాన్ బ్యాటరీ వ్యర్థాలను రీసైకిల్ చేయాలని అటెరో ఇండియా లక్ష్యంగా పెట్టుకొన్నది.