హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): నల్లమల్ల ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్న బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్తోపాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి జావేద్ మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాల పేరుతో మొత్తం నల్లమల్ల ప్రాంతాన్ని అదానీకి అప్పగించే చర్యలను బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని, అందులో భాగంగానే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారని అన్నారు. నల్లమలను రక్షించేందుకు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ నాయకులు హష్మీ, అజయ్, హరిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.