హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): దసరా వేడుకల సందర్భంగా హైదరాబాద్లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని కుట్ర పన్ని పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదుల కేసు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయినది. డీఎస్పీ రాజీవ్కుమార్ సింగ్ నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగనున్నది. ఈ కేసులో లష్కరే తోయిబా సంస్థకు చెందిన అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్ను నిరుడు నవంబర్ 2న హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో సీసీఎస్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. పాకిస్థాన్లోని ఫర్హతుల్లా ఘోరీ, సిద్దిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్ ఆదేశాలతో విధ్వంసానికి కుట్ర పన్నిన ఈ ముగ్గురికి చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు జమ్ముకశ్మీర్ సరిహద్దులో అందాయి. అక్కడి నుంచి స్లీపర్ సెల్స్ ద్వారా మెదక్ జిల్లా మనోహరాబాద్కు చేరిన పేలుడు పదార్థాలను ఈ ముగ్గురిలో ఒకడు హైదరాబాద్కు తెచ్చి మిగిలిన వారికి అందించాడు. దీన్ని నిఘా సంస్థలు గుర్తించడంతో భారీ విధ్వంసం తప్పింది.