హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): విజయదశమి పండుగ ఈ నెల 23న ఉంటుందని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. వర్గల్లోని విద్యాసరస్వతి దేవాలయంలో ఇటీవల జరిగిన తెలంగాణ విద్వుత్సభ షష్ఠమ వార్షిక విద్వత్సమ్మేళనంలో వందమంది సిద్ధాంతులు ధర్మశాస్ర్తానుసారం చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, కార్యదర్శి గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి తెలిపారు. ఈ నిర్ణయాన్ని శృంగేరీ జగద్గురువులు, కంచికామకోటి పీఠాధీశ్వరులు, పుష్పగిరిపీఠం, గురుమదనానంద పీఠం పీఠాధీశ్వరులు ఆమోదించినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలందరూ దసరా పండుగను 23న జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ సూచించింది.