హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్మేస్తున్నది. చలి తీవ్రత పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చాలాచోట్ల సాధారణం కంటే తక్కువగా ఉ ష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మంలో 29.3 డిగ్రీలు, అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రత సిర్పూర్లో 8.3 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఆగ్నేయ దిశ ల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని, వచ్చే మూడు రోజులు సాధారణం కంటే తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.
వచ్చే రెండు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్తోపాటు సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 29.3 డిగ్రీలు, కనిష్ఠంగా 15.6 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం 082 శాతం ఉండటంతో చలి తీవ్రత అధికంగా ఉంటున్నట్టు తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్లో మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 15.6 డిగ్రీలు, గాలిలో తేమ 32 శాతంగా నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న బస్సు ఇబ్రహీంబాద్ గేటు వద్ద దట్టమైన పొగమంచుతో పక్కకు వెళ్లింది. అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఒకవైపు ఒరిగింది.
శంషాబాద్ రూరల్/హన్వాడ, డిసెంబర్ 26: పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాస్ ఆల్ఖైమా ఎయిర్పోర్టు నుంచి శంషాబాద్కు మంగళవారం ఉదయం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు నాగపూర్ ఎయిర్పోర్టుకు దారి మళ్లించినట్టు తెలిసింది. దట్టమైన పొంగమంచు కారణంగా మరికొన్ని విమానాలనూ దారి మళ్లించినట్టు తెలిసింది. శంషాబాద్తోపాటు సమీప గ్రామాల్లోనూ ఉదయం 9.30 వరకు దట్టంగా పొగమంచు కురవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.