హైదరాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలోని రామేశ్వరాలయం వెలుపల అపురూప శిల్పాలను భద్రపరచాలని పురావస్తు పరిశోధకుడు డాక్టర్ శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు అహోబిలం కరుణాకర్, సామవేటి మహేశ్, నసీరుద్దీన్లు ఇచ్చిన సమాచారం మేరకు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి ఆదివారం శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారసత్వ సంపద గొప్పతనం గురించి ఆయన స్థానికులకు అవగాహన కల్పించారు. ఇక్కడి చెన్నకేశవ, వేణుగోపాల, భైరవ, దేవి విగ్రహాలు కాకతీయుల శిల్ప కళకు అద్దం పడుతున్నాయని, అవగాహన లేని ఆలయ సిబ్బంది వాటిపై సున్నం వేయడంతో ప్రాచీనతను పోగొట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప చరిత్ర గల ఈ శిల్పాలను భద్రపరచాలని ఆయన కోరారు.