బొడ్రాయిబజార్, మార్చి 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 20 వేల పోస్టులకు తగ్గకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన మినీ డీఎస్పీ ప్రకటనను వ్యతిరేకిస్తూ సోమవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని గ్రంథాలయం ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 11,062 పోస్టుల్లో అధికంగా ఎస్జీటీ పోస్టులున్నాయని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 మాత్రమే ఉండడం బాధ కలిగిస్తుందని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఎస్జీటీ అర్హత లేకపోవడం దారుణమని చెప్పారు. గత నోటిఫికేషన్కు ప్రస్తుత నోటిపికేషన్కు ఎలాంటి పోస్టులు పెరుగలేదని వాపోయారు. ఈ మార్చిలో ఉద్యోగ విరమణతో ఖాళీ అయ్యేవాటితో కలిపి 24 వేల పోస్టులతో మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని, టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో చేపట్టిన డీఎస్సీ ధర్నాకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు.