హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరుద్యోగ జేఏసీ నేతలు, టీచర్ అభ్యర్థులు గురువారం హైదరాబాద్ సైఫాబాద్లోని విద్యాశాఖ డైరెక్టరేట్ను ముట్టడించారు. అనంతరం కమిషనర్ శ్రీదేవసేనకు వినతిపత్రం ఇచ్చారు. 25 వేల టీచర్ పోస్టులతోపాటు 15 వేల అటెండర్, స్వీపర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ ముట్టడిలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ టెట్ నిర్వహణకు ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు. గతంలో 10 నుంచి 15 శాతం లోపే అభ్యర్థులు టెట్లో పాసయ్యారని గుర్తుచేశారు. డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీలో ఐఈఆర్పీలకు 30 శాతం వెయిటేజీనని ఇవ్వాలని స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఫోరం జాతీయ కన్వీనర్ కల్పగిరి శ్రీను ఒక ప్రకటనలో కోరారు.