DSC Applications | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఈ రోజు రాత్రికే ఇన్ఫర్మేషన్ బులెటిన్, జిల్లా, సబ్జెక్టు, రిజర్వేషన్ వారీగా ఖాళీలు, సిలబస్ తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఆ తర్వాత నుంచి ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసుకునే అవకాశాన్నిస్తారు.
2023 డీఎస్సీకి 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వీటిలో 2,629 స్కూల్ అసిస్టెంట్, 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 727 భాషాపండితులు, 182 పీఈటీ పోస్టులున్నాయి.
ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 ఉండగా, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 796 ఉన్నాయి. సోమవారం నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 2తోనే ముగుస్తుంది. తాజాగా గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అర్హతలు.. నిబంధనలు
హెల్ప్డెస్క్
డీఎస్సీకి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్డెస్క్ను ఏర్పాటుచేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయదలిస్తే, ప్రతి ఉద్యోగం కోసం వెయ్యి రూపాయలు ఫీజుగా చెల్లించాలి.