Telangana | హైదరాబాద్ : హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ 2008 బాధిత అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం దాదాపు 200 మందికి పైగా అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో.. సీఎం వ్యక్తిగత కార్యదర్శి జైపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీఎస్సీ బాధితులు మాట్లాడుతూ.. తాము న్యాయం కోసం 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని వాపోయారు. 2008 డీఎస్సీలో నష్టపోయిన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని చెప్పారు. ఈ మేరకు తమకు నియామక ప్రక్రియ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని, రెండు రోజుల్లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందజేస్తామని చెప్పారు.