హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో గరిష్ఠంగా 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, నారాయణపేట తదితర జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది. ఈనెల 15 వరకు వాతావరణం ఈ విధంగా ఉంటుందని తెలిపింది. 19తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. కాగా, రుతుపవన ద్రోణి శ్రీగంగానగర్, హిస్సార్, మీరట్, గోరఖ్పూర్ మీదుగా దక్షిణ అస్సాం వరకు కొనసాగుతున్నదని, దీంతో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఉపరితల గాలులు 40 నుంచి 50 కి.మీ వే గంతో వీచే అవకాశం ఉండగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.