ముత్తారం, మార్చి 30: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎస్సారెస్పీ డీ-83 కెనాల్ను నమ్ముకొని సాగు చేసిన సీతంపల్లి, ఇప్పలపల్లిలోని సుమారు 700 ఎకరాలకు నీరందని పరిస్థితి నెలకొన్నది. సాగు ప్రారంభ సమయంలో డీ-83 కెనాల్ నీరు విడుదల చేయడంతో రైతులు సంబురపడ్డారు.
నీళ్లు వస్తాయని దండిగా సాగు చేశారు. కానీ చుక్క నీరు రాకపోవడంతో పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటిపోయాయి. పంట పొట్ట దశకు చేరింది. నీళ్లు లేక ఎండిపోతున్నది. నీటిని విడుదల చేయాలని అధికారులను కోరినా లాభం లేకపోవడంతో కడుపుమండి పశువులను మేపుతున్నారు.
నీళ్లు రావని చెప్తే సాగు జోలికి పోకపోదుం
కెనాల్ నీళ్లు రావని అధికారులు ముందే చెబితే మేం పంట సాగు జోలికి పోకపోదుం. వరి వేయక పోయేటోళ్లం. కెనాల్ నీళ్లు వస్తయని ఆశతో నేను ఆరెకరాల్లో వరి వేసిన. కానీ ఒక్కసారి వచ్చిన నీళ్లు మళ్లీ రాలేదు. చేసేదేం లేక పొట్టదశలో పంటను విడిచిపెట్టిన. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టిన. మమ్ములను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– బోయిని రాజమల్లు, సీతంపేట