Adilabad | ఎదులాపురం, జూలై 24: మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకునేందుకు స్తంభం ఎక్కి విద్యుత్తు తీగలను పట్టుకొని వేలాడాడు. సకాలంలో కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కేఆర్కే కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాలు అలియాస్ ప్రవీణ్ తన భార్యతో గొడవ పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న బాలు.. ఆత్మహత్య చేసుకుంటానని, కాలనీలోని ఓ విద్యుత్తు స్తంభం ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే కరెంట్ సరఫరాను నిలిపివేయించారు. దీంతో స్తంభం ఎక్కిన బాలు కొద్దిసేపు అలాగే విద్యుత్తు తీగలకు వేలాడాడు. స్థానికులు సముదాయించినా వినలేదు. కొద్దిసేపటి తర్వాత తీగలను వదిలేసి, కింద పడ్డాడు. గాయపడ్డ బాలును స్థానికులు ఆటోలో రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతున్నాడు.