ఇద్దరు పెడ్లర్స్ను అరెస్టు చేసిన ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ బృందం
హైదరాబాద్, ఫిబ్రవరి 17 : డార్క్నెట్ వెబ్సైట్ల ద్వారా మత్తుపదార్థాలు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న ముఠాకు చెందిన ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన సోదాల్లో నిందితులు పట్టుబడినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఎన్ఏ అజయ్రావు, స్టేట్ టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ గురువారం తెలిపారు. ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ ఈఎస్ కే పవన్కుమార్ నేతృత్వంలో మెహిదీపట్నంలోని రిలయెన్స్ కోహినూర్ అపార్ట్మెంట్లో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో హర్బాజ్, ముబాసిర్ అహ్మద్ అనే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి ఐదు ఎల్ఎస్డీ ప్యాక్లు, 80 గ్రాముల పొడి గంజాయి లభించింది. వీరిద్దరికి షోహిబ్ఖాన్ అనే వ్యక్తి డార్క్నెట్లో ఆర్డర్లు ఇచ్చి డ్రగ్స్ తెప్పించి ఇస్తున్నట్టుగా ఆ ఇద్దరు నిందితులు అంగీకరించారని అధికారులు తెలిపారు. షోహిబ్ఖాన్ కోసం ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ బృందాలు గాలింపు చేపట్టాయి. నిందితుల నుంచి రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.