హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ వినియోగంతో తలెత్తే అనర్ధాలు, సైబర్ నేరాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. డిగ్రీ, పీజీ పాఠ్యపుస్తకాల్లో ఈ రెండు అంశాలను చేర్చాలని, ఇందుకు క్రెడిట్స్ ఇవ్వాలని ఇటీవల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించింది. సైబర్ సెక్యూరిటీపై బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో కొన్ని పాఠ్యాంశాలను చేర్చారు. కానీ, బీఏ, బీకాం, బీఎస్సీ సహా సైన్స్ ఆర్ట్స్ పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు సైబర్ నేరాలపై ఎలాంటి ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే డిగ్రీ, పీజీ కోర్సుల్లోని పుస్తకాల్లో ఈ అంశాలను చేర్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 7 వర్సిటీల్లో పీజీ కోర్సులకు కామన్ కరిక్యులం రూపొందించనున్నారు. సీనియర్ ఆచార్యులతో నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి త్వరలోనే కొత్త పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ రెండు అంశాలు అందుబాటులోకి వస్తాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సమగ్రంగా చర్చించి కరిక్యులంలో భాగంగా డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలను చేర్చాలని నిర్ణయించినట్టు ఆయన వివరించారు.