హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): గోదాముల్లో భారీ ఎత్తున నిల్వ చేసిన ఫిజీషియన్ శాంపిళ్లను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని పీఅండ్టీ కాలనీలో అక్రమంగా ఔషధాలు నిల్వ చేసినట్టు డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కు ఓ వ్యక్తి సమాచారమిచ్చారు. అధికారులు తనిఖీ చేసి 52 రకాల ‘ఫిజీషియన్ శాంపిల్’ మందు లున్నట్టు గుర్తించారు. ఇందులో యాంటీ బయాటిక్స్, యాంటీ డయాబెటిక్, యాంటీ యూక్లేర్, యాంటీ హెపటైటిస్, యాంటీ ఫంగల్ ఔషధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని చెప్పారు. ఈ గోదామును కొడకండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో బబ్లు హరిప్రసాద్ బిశ్వాస్ అనే ఆర్ఎంపీ తన క్లినిక్లో అక్రమంగా నిల్వ చేసిన విలువ రూ.50 వేల విలువైన 50 రకాల మందులను సీజ్ చేసినట్టు చెప్పారు. ఔషధాల అక్రమ నిల్వలు, అనుమానిత మందులపై టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని డీసీఏ అధికారులు కోరారు.