హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
గడిచిన 24 గంటల్లో మెదక్ జిల్లా రామాయంపేట, జనగామ జిల్లా జఫర్గఢ్, వరంగల్ జిల్లా సంగెంలో 4 సెం.మీ చొప్పున వర్షం పడింది. రాబోయే 24 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.