హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): పంటలకు ఎరువులు, విత్తనాలు చల్లేందుకు రైతులకు డ్రోన్లను కిరాయికి ఇచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రోస్ ద్వారా శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యికి పైగా ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల (ఏఆర్ఎస్కే) ద్వారా డ్రోన్లను రైతులకు చేరువ చేయాలని, వచ్చే వానకాలం నుంచే అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)తో ఆగ్రోస్ ఒప్పందం కూడా చేసుకున్నది.
ఆగ్రోస్ ఏఆర్ఎస్కేల ద్వారా విత్తనాలు, ఎరువులను సరఫరాతో పాటు డ్రోన్ల సేవలను కూడా వారి ద్వారానే అందించాలని నిర్ణయించింది. ఏఆర్ఎస్కే ప్రతినిధులకు డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇప్పించనుంది. రూ.10 లక్షల వరకు ఖర్చయ్యే ఒక్కో డ్రోన్ కొనుగోలుకు వీరికి బ్యాంకు రుణాలు ఇప్పించనుంది. వీరు రైతులకు కిరాయికి డ్రోన్ల సేవలు అందించనున్నారు.
డ్రోన్ల వినియోగంతో విత్తనాలు, ఎరువులను చల్లడం వల్ల వృథాను అరికట్టవచ్చు. కూలీల ఇబ్బందులను అధిగమించడంతో పాటు పెట్టుబడి ఖర్చునూ తగ్గించవచ్చు. ఇప్పటికే యూరియా లిక్విడ్ రూపంలో రాగా, డీఏపీ, ఇతర ఎరువులు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీంతో డ్రోన్ల ద్వారా ఎరువుల పిచికారీ సులభతరం కానున్నది. సరిగ్గా మొక్కకు అందుతుంది. విత్తనాలను సరైన దూరంలో వేసే వీలుంటుంది.
ఎరువులు, విత్తనాలు చల్లేందుకు రైతులకు ఆగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా డ్రోన్లను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ వానకాలం నుంచి ఎంపిక చేసిన కేంద్రాల్లో వాటిని అందుబాటులోకి తీసుకొస్తాం.
– తిప్పన విజయసింహారెడ్డి, చైర్మన్, ఆగ్రోస్