కాంగ్రెస్ హయాంలో.. బావి నుంచి మంచినీరు తోడుకుని, ఊరికి దూరంగా అర కిలోమీటరు నుంచి గుట్టల మధ్య నుంచి తాగునీటిని తీసుకొస్తున్న వారు ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ) పంచాయతీ మాన్కుగూడ గ్రామస్థులు. గ్రామంలో 65 కుటుంబాలు ఉండగా 280 వరకు జనాభా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో తాగునీటికి ఇలాంటి ఇబ్బందులే ఉండేవి. సమైక్య పాలకులు నిర్లక్ష్యంతో కలుషిత నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడేవారు.
Adilabad | ఆదిలాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు వరంగా మారిం ది. జిల్లాలో మిషన్ భగీరథ అందుతున్న గ్రామాలు 1,234 ఉన్నాయని అధికారుల నివేదికలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు మాత్రం బీఆర్ఎస్ను బద్నాం చేయడానికి పని కట్టుకున్నా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు తాగునీరు అందించలేదని సీఎం రేవంత్రెడ్డి కనీస అవగాహన లేకుండా ఇంద్రవెల్లి సభలో మాట్లాడటంపై జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వాస్తవాలు గమనించాలని సూచిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులకు కనిపించవా?
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వ్యాధులతో విలవిలలాడే వారు. గ్రామాల్లో తీవ్రమైన మంచినీటి సమస్య ఉండేది. కలుషితమైన నీటిని తాగి అతిసారం, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ మరణించే వారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆరేండ్లుగా మిషన్ భగీరథ పథకం మారుమూల గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తున్నది.
మిషన్ భగరథ పథకంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పీ నుంచి తాగునీటిని సరఫరా చేయగానికి గ్రీడ్ పైపులైన్ 1990.90 కిలోమీటర్లు, ఇంట్రా పైపులైన్ 1,761 కిలోమీటర్లు వేశారు. జిల్లా వ్యాప్తంగా 1,73, 283 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా 1,234 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 735 గ్రామాలకు, కుమ్రంభీం ప్రాజెక్టు ద్వారా 491 గ్రామాలకు తాగునీరు అందుతున్నది. రోజుకు 6 కోట్ల లీటర్ల మంచినీటిని అధికారులు ప్ర జలు తాగేందుకు సరఫరా చేస్తున్నారు.
కోట్ల రూపాయలు ఆదా..
ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేది. ప్రాజెక్టులు, చెరువులు అంతంత మాత్రంగానే ఉండటం తో భూగర్భ జలాలు అండుగంటిపోయేవి. ఏటా 200 నుంచి 250 గ్రామాల ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొనేవారు. గిరిజన తండా లు, ఆదివాసీ గూడేలు, మారుమూల పల్లెలకు అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. ఇందుకోసం కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. 2016లో 256 గ్రామాలకు నీరు సరఫరా చేయగా ఇందుకు 6 కోట్లు, 2017లో మంచినీటి ఎద్దడి నివారణకు రూ.80 లక్షలు, 2018లో 40 గ్రామాల్లో మంచినీటిని అందించడానికి రూ.62 లక్షలు ఖర్చు చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. దీంతో 25 ఏండ్లుగా ఉన్న మాన్కుగూడ గిరిజనుల మంచినీటి సమస్యకు పరిష్కారం లభించింది. కేసీఆర్ ప్రభుత్వం గ్రామంలో మంచినీటి ట్యాంకు నిర్మించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేస్తున్నది. దీంతో గ్రామంలో ఉన్న 65 ఇండ్లకు ఇంటింటికీ నల్లా నీరు అందుతున్నది. ఐదేండ్లుగా నల్లానీరు వస్తుండటంతో సంతోషంగా ఉన్నారు. గ్రామంలో వ్యాధులు తగ్గుముఖం పట్టాయి.