నిడమనూరు, సెప్టెంబర్ 7 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం సా యంత్రం గండిపడింది. మొదట ఎడమ ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నెల్లో చిన్న రంధ్రం ఏర్పడింది. అది క్రమేపీ పెరుగుతూ కట్ట కోతకు గురవడంతో సాయంత్రం 5 గంటలకు గండి పడింది.
క్రమంగా గండి పెద్దది కావడంతో నీటి ఉధృతికి నిడమనూరు మండల కేంద్రంతోపాటు నర్సింహుగూడెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోవడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు వెయ్యి ఎకరాలు నీట మునిగినట్టు రైతులు తెలిపారు. నిడమనూరు-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై ఏడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేయించారు.