ఖైరతాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్రంలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొర్ర ఈశ్వర్ లాల్ డిమాండ్చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1,940 మంది గెస్ట్ లెక్చరర్లు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. తమకు శ్రమకు తగిన వేతనం దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల కారణంగా ప్రభావితమయ్యే గెస్ట్ లెక్చరర్లను ఖాళీగా ఉన్న సమీప కళాశాలల్లో వెంటనే నియమించాలని కోరారు. యూజీసీ నిబంధనల మేరకు రూ.50వేల వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నరేందర్, వెంకటేశం, గంగాధర్, రాజు, శ్రీనివాస్, తేమాజీ, జనార్దన్, రాంప్రసాద్ పాల్గొన్నారు.