హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల విగ్రహ ఏర్పాటు పనులు కీలకదశకు చేరుకొన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యవేక్షణలో పనులు చకచకా సాగుతున్నాయి. దేశంలో అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని, స్మృతివనాన్ని తీర్చిదిద్దుతామని 2016 ఏప్రిల్ 14న నిర్వహించిన జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.
ఆ వెంటనే ట్యాంక్బండ్ను ఆనుకొని ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన దాదాపు 11.04 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే 50 అడుగుల ఎత్తయిన పీఠంపై 125 అడుగుల ఎత్తయిన అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీంతోపాటు మ్యూజియం, అంబేద్కర్ జీవితంలోని ముఖ్య సంఘటనలకు సంబంధించిన ఫొటో గ్యాలరీని, 2.93 ఎకరాల్లో పార్క్ను తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేసిన వెంటనే పనుల ప్రారంభమయ్యాయి. విగ్రహ ఏర్పాటుకు శాస్త్రీయ పరీక్షలన్నింటినీ పూర్తి చేసి పనులను చేపట్టారు.
స్మారక భవనానికి సంబంధించిన మెయిన్ బిల్డింగ్ నిర్మాణం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫ్యాబ్రికేషన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. స్మృతివనం అనుబంధ భవనాలకు సంబంధించి టాయిలెట్ బ్లాక్, టికెట్ కౌంటర్, అండర్ గ్రౌండ్ సంప్, సెక్యూరిటీ రూం నిర్మాణ పనులు సైతం పూర్తికాగా, ప్లాస్టరింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. స్మృతివనం తూర్పు, ఉత్తరం వైపు ప్రహరీ నిర్మాణంతోపాటు గ్రిల్ ఫిక్సింగ్ పనులు పూర్తికాగా, దక్షిణం వైపు గ్రిల్ ఫిక్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి 50 అడుగుల పీఠం ఇప్పటికే పూర్తయింది. మొత్తంగా డిసెంబర్నాటికి స్మృతివనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.