హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో అంబేద్కర్ స్ఫూర్తిని చూశానని, అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే వారు మొక్కలు నాటాలని కోరేవారని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ గుర్తు చేసుకొన్నారు. శుక్రవారం హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ఎంపీ సంతోష్కుమార్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి ప్రకాశ్ అంబేద్కర్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. తనను కలవాలనుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పిన తాత బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న ఎంపీ సంతోష్కుమార్ ఆశయం గొప్పదని కొనియాడారు. మనుషుల్లో సమానత్వం, ప్రకృతి సమతుల్యత కోసం పరితపించిన అంబేద్కర్ జయంతి రోజున మొక్కను నాటడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లిమ్కాబుక్లో చేరడం సంతోషం కలిగించిందని చెప్పారు. ఎంపీ సంతోష్కుమార్ కృషికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సంజీవ రాఘవ పాల్గొన్నారు.