పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం అధునాతన భవనం సిద్ధమైంది. అనివార్య పరిస్థితుల్లో కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా, సకల ఏర్పాట్లతో సమున్నత పాలన అందించేలా రూపుదిద్దుకొన్నది. చారిత్రక వైభవం, తెలంగాణ ప్రగతి చిహ్నంగా హైదరాబాద్ సిగలో కలికితురాయిలా ధగధగలాడనున్నది. దేశంలోనే అనేక చారిత్రక కట్టడాలకంటే ఎత్తులో నిర్మితమైన ఈ ఆత్మగౌరవ సౌధం చరిత్రలో అద్భుత నిర్మాణంగా నిలిచిపోనున్నది.
Secretariat | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ మడమతిప్పని పోరాటం, అమరుల త్యాగాలతో సిద్ధించిన స్వరాష్ట్రంలో పాలన సాగించేందుకు శిథిల భవనాలే దిక్కయ్యాయి. రకరకాల సమస్యలతో అటు ఉద్యోగులు, ఇటు సందర్శకులు తీవ్ర ఇబ్బంది పడేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జూన్ 2, 2014 నుంచి కొంతకాలంపాటు ఏ,బీ,సీ,డీ బ్లాకులుగా ఉన్న పాత సచివాలయం నుంచే పాలన సాగింది. అయితే, తరచూ పైకప్పు పెచ్చులు ఊడటం, విద్యుత్ షార్ట్సర్క్యూట్ సమస్యలు తలెత్తడం, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం తదితర ఇబ్బందులు ఎదురయ్యేవి. పాలనాపరమైన ఇబ్బందులూ తలెత్తాయి. శాఖల మధ్య సమన్వయం లేదు. దీంతో సీఎం కేసీఆర్ పాత సచివాలయంపై నివేదిక కోరుతూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలో ఓ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సచివాలయం కండీషన్ సరిగా లేదని సబ్ కమిటీ నిర్ధారించింది. అనంతరం ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల ఇంజినీర్ ఇన్ చీఫ్లతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి, పలు లోపాలను గుర్తించింది. ఫైర్సేఫ్టీ, ఎన్బీసీ, గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సమీకృత సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని కమిటీ నివేదిక సమర్పించింది. దీంతో ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు చేసింది.
నూతన సచివాలయాన్ని పరిపాలనా సౌలభ్యంగా ఉండేలా అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. సందర్శకులకు ఇబ్బం ది కలుగకుండా ఏ,బీ,సీ,డీ విభాగాలుగా పేర్లు పెట్టారు. ఒక్కో విభాగాన్ని కొన్ని శాఖలకు కేటాయించారు. అన్ని అంతస్థుల్లో ఉద్యోగులకు లంచ్ రూమ్లను నిర్మించారు. ఆరో అంతస్థులో క్యాబినెట్ మీటింగ్ హాలు, కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు. సచివాలయంపై నిర్మించిన గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆహ్లాదకరంగా ఉండేందుకు సచివాలయం ముందు, భవనం మధ్యభాగంలో గ్రీనరీ ఏర్పాటు చేశారు. చుట్టూ రోడ్లతోపాటు నలుదిక్కులా గేట్లను అమర్చారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు భవనం చుట్టూ ఫైరిం జిన్ తిరిగేలా ఏర్పాట్లు చేశారు.
దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్ల నుంచి భవన ప్లాన్లను ఆహ్వానించిన ఆర్అండ్బీ శాఖ, చివరకు ఆస్కార్ అండ్ పొన్నీ ఆర్కిటెక్ట్స్ను సచివాలయానికి కన్సల్టెంటుగా నియమించింది. మరోవైపు ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణానికి రూ.617 కోట్లు మంజూరుచేస్తూ సెప్టెంబర్ 10, 2020న ఉత్తర్వులు జారీచే సింది. ఆర్కిటెక్ట్ సంస్థ సమర్పించిన ప్లాన్ ఆధారంగా భవనాన్ని నిర్మించాలని ఆర్అండ్బీ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దేశంలోనే ప్రఖ్యాత నిర్మా ణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ పనులు దక్కించుకొన్నది. ఎయిర్పోర్ట్ అథారిటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత 2021 జనవరిలో నిర్మాణ పను లు ప్రారంభించారు. ఈ ఏప్రిల్ నెలాఖరుకు 26 నెలలు పూర్తవుతున్నది. ఆర్ అండ్ బీ శాఖ ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సి ల్), టీఎస్ టెక్నలాజికల్ సర్వీసెస్, రాష్ట్ర పోలీసు విభాగాల సూచనలతో లోపం లేకుండా భవనాన్ని నిర్మించింది.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమీకృత సచివాలయ భవన నిర్మాణం దేశంలోని ప్రముఖ చారిత్రక కట్టడాలకన్నా ఎంతో ఎత్తైనది. ప్రధాన గుమ్మటాలపై ఏర్పాటుచేసిన అశోకుడి చిహ్నం నేలపై నుంచి 265 అడుగుల ఎత్తులో ఉండటం విశేషం. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా నిర్మించారు. ఆరో అంతస్థులో సీఎం, సీఎస్, సలహాదారుల కార్యాలయాలను ఏర్పాటు చేశారు.