Green India Challenge | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో 14న మొక్కలు నాటుదామని గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హుస్సేన్సాగర్ ఒడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. అంబేద్కర్ ప్రకృతిపై చూపిన శ్రద్ధ అద్భుతమని కొనియాడారు. తన సందర్శనకు వచ్చే వారు మొక్కలు నాటి తర్వాతే తనను చూడాలని కోరుకున్న గొప్ప మహనీయుడని అన్నారు. అంబేద్కర్ పిలుపుతో ప్రజలందరూ స్ఫూర్తి పొందాలని అన్నారు. ఈ సందర్భంగా మొక్క నాటుతున్న ఫొటోను ఎంపీ ట్విట్టర్లో జత చేశారు.