హనుమకొండ, మే 5 : కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చిన హామీల అమలును విస్మరించిందని మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ ఆరోపించారు. హనుమకొండ హంటర్రోడ్డులో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు వేదిక నుంచి మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
గతంలో తెలంగాణ ప్రాంతంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ నాయకత్వంలో అది 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులకు చేరిందని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా సాగితే కాంగ్రెస్ పాలనలో దండుగగా మారిందని చెప్పారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను సక్రమంగా కొనకపోవడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ఆకాంక్షించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ తెలంగాణ రైతుల గోస ప్రపంచానికి తెలియజేసేందుకు రైతు సంగ్రామ సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమ్మేళనాలు నిర్వహించడం కాదని, వారి సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాపాలన అంటూ ప్రతీకార పాలన చేస్తున్నదని ఆరోపించారు.
రైతు సంగ్రామ సదస్సుకు కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రం ఇప్పటికే కేసీఆర్ ప్రవేశపెట్టిన చాలా పథకాలను అమలుచేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటి అమలును విస్మరించిందని విమర్శించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ సమయంలో తాను, రాహుల్ గాంధీ పాల్గొన్నామని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ..ఎన్ని అడ్డంకులు ఎదురైనా రైతు సంగ్రామ సదస్సును విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు.