హైదరాబాద్ జనవరి 26 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే రాజ్భవన్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కు అవమానం జరిగింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ.. తన భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటాన్ని పెట్టని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా దేశమంతా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ చిత్రపటాన్ని జాతీయ జెండా స్తూపం పక్కన ఉంచి, నివాళులు అర్పించడం ఆనవాయితీ. అయితే రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటం ఎక్కడా కనిపించలేదు. హడావిడిగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై.. కనీసం ‘అంబేద్కర్ఫొటో ఉందో లేదో కూడా గమనించలేదు. వస్తూనే సైనిక, పోలీసు వందనం స్వీకరించి ఆ వెంటనే ప్రసంగం మొదలుపెట్టారు. తన ప్రసంగంలో ఐదారుసార్లు రాజ్యాంగ స్ఫూర్తి అంటూ ప్రస్తావించిన గవర్నర్కు గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్కు నివాళులు అర్పించాలనే కనీస ఆలోచన రాకపోవడం శోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు. తన సందేశం పూర్తయిన తర్వాత కూడా ఈ విషయంపై అక్కడి సిబ్బందిని వాకబు చేయకపోవడం అక్కడున్న అతిథులను, మీడియాను విస్మయానికి గురిచేసింది. పాతికేండ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్న తనకు ప్రొటోకాల్ ఎలా ఉంటుందో తెలుసునని ఇటీవల వ్యాఖ్యలు చేసిన గవర్నర్కు.. ఈ చిన్న విషయం తెలియదా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ‘ఫక్తు బీజేపీ రాజకీయ నాయకురాలిగా మారిన గవర్నర్కు.. ఈ విషయాలు ఎలా బోధ పడతాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ.. గణతంత్ర వేడుకల సందర్భంగా రాజకీయ వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె ఓ గవర్నర్లా కాకుండా రాజకీయ నాయకురాలిగా మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. ‘కూల్చడం, కాల్చడమే తెలిసిన బీజేపీ నాయకులకు.. కొత్తగా నిర్మించే భవనాల విలువ ఎలా తెలుస్తుంది?’ అని ఒకరు.., ‘ఏదైనా నియోజకవర్గం చూసుకొని పోటీ చేయొచ్చుగా’ అంటూ మరొకరు.. ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి చిల్లర రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు’ అంటూ మరొకరు వ్యాఖ్యలు చేశారు. మనవాళ్లు కొత్తగా సచివాలయాన్ని నిర్మించుకుంటే అభివృద్ధి కాదంటూ అభ్యంతరం తెలిపిన గవర్నర్ గతంలో కొత్త పార్లమెంట్ భవనం ఫొటోను పోస్టు చేసిన చిత్రాలను షేర్ చేస్తూ.. ‘రెండింటికి మధ్య తేడా ఏంటి?’ అని ప్రశ్నిస్తున్నారు.
పాతికేండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న తమిళిసైకి ‘జెండా ఆవిష్కరణ, ఎగురవేతకు’ మధ్య తేడా తెలియదా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జాతీయ జెండా ఎగురవేశాను’ అని తమిళ, ఇంగ్లిష్ భాషల్లో ఆమె ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్కు విపరీతమైన ప్రతిస్పందన వస్తున్నది. ఓ నెటిజన్ ‘మేడమ్ గవర్నర్ తమిళిసై గారు.. మీకు జాతీయ జెండా ఎగురవేయడం, ఆవిష్కరించడం మధ్య తేడా తెలియదా? రిపబ్లిక్ డే రోజున భారత రాష్ట్రపతి, గవర్నర్లు జెండాను ఆవిష్కరిస్తారు. పంద్రాగస్టు రోజున ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు జెండాను ఎగురవేస్తారు’ అంటూ తేడాను వివరించారు. దీంతో మరికొందరు నెటిజన్లు ‘సామాన్యులకు సాంకేతికంగా ఇలాంటి పదాల గురించి తెలియక పోవచ్చు.. గవర్నర్గా మీకు ఆ మాత్రం తెలియదా?’ అని ప్రశ్నిస్తున్నారు.
ఆగస్టు 15న, జనవరి 26న జాతీయ జెండా ఎగురవేయడానికి చిన్న తేడా ఉన్నది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అలాగే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను స్తంభానికి దిగువున కడతారు. బ్రిటీష్ పాలన అంతమై, మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని చెప్పడానికి గుర్తుగా మన త్రివర్ణ పతాకాన్ని కింద నుంచి పైకి లాగి ఎగురవేస్తారు. ఇక గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి, గవర్నర్లు జెండాను ఆవిషరిస్తారు. త్రివర్ణ పతాకాన్ని స్తంభానికి పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిషరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉన్నదని తెలియజేస్తారు.
కరోనా లాంటి క్లిష్ట సమయంలో నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా నిర్మాణం కంటే, దేశంలో మౌలిక సదుపాయాలపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశాం. కేవలం కొంతమంది వ్యక్తుల సంపద పెంపుపై దృష్టి సారించకుండా.. రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోరాడుతున్నది. గణతంత్ర దినోత్సవం లాంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్కు ధన్యవాదాలు.
-కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున రాజ్యాంగ విరుద్ధమైన, ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా ప్రవర్తించారు. కొత్త భవనాలు అభివృద్ధి కాదని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గవర్నర్ వ్యతిరేకిస్తున్నారని అనుకోవాలా ? గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని గవర్నర్ మర్చిపోయారా? జాతి నిర్మాణం అంటే ఏందో చెప్పాలి. తెలంగాణ భారత్లో లేదా? రాజ్భవన్ మాత్రమే జాతి నిర్మాణంలో పాలుపంచుకొంటుందా ?
-వై సతీశ్రెడ్డి, రెడ్కో చైర్మన్
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున గవర్నర్ ప్రభుత్వంపై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. కొత్త భవనాలు కట్టడం అభివృద్ధి కాదంటే, సెంట్రల్ విస్టా నిర్మాణం ఎందుకు ? రాష్ట్రంలో ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు అభివృద్ధి కాదని అంటారా? అంబేద్కర్ పేరుతో నిర్మిస్తున్న నూతన సచివాలయం, జిల్లా కలెక్టరేట్లు అభివృద్ధికి సంకేతం కాదా? రైతును రాజు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. తెలంగాణ ఆచరిస్తున్నదే, దేశమంతటా అనుసరించటం నిజం కాదా ?
-ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్
రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా గవర్నర్ మాట్లాడటం సరికాదు. గణతంత్ర వేడుకలో గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాజకీయాలు మాట్లాడటం తగదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ గవర్నర్ ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సబబు కాదు. గవర్నర్ వైఖరిపై త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తాం.
– మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా ప ని చేయడం స రికాదు. నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి గవర్నర్ను చూడలేదు. ఇదివరకు ఏ గవర్నర్ చేయని విధంగా ప్రస్తుత గవర్నర్ సీఎం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా వ్యవహరిస్తుండటం బాధాకరం. ప్రజల అవసరాల కోసం సీఎం తీసుకునే నిర్ణయాలను గవర్నర్ వ్యతిరేకించకూడదు. బయటి రాష్ర్టాల్లో రైతుబంధు, నిరంతర విద్యుత్తు సరఫరా లేదు. తెలంగాణను వేరే రాష్ర్టాలతో పోల్చలేం. ఆమె గవర్నర్ వ్యవస్థనే కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్ర భుత్వంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికా దు. రాజ్భవన్లో రాజకీయాలు చేయ డం మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కేంద్రం ప్రశంసిస్తుంటే, ఈమె విమర్శించడం అత్యం త దారుణం. రాజ్యాంగం కల్పించిన గౌరవాన్ని గవర్నర్ కాపాడుకోవాలి. హుందాగా వ్యవహరించాలి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్భవన్ను రాజకీయ వేదికగా మార్చుకొని బీజేపీ ప్రతినిధిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు.
-అనిల్ కూర్మాచలం, ఎఫ్డీసీ చైర్మన్
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించే రీతి లో మాట్లాడిన గవర్నర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంబేదర్ పేరును నూతన సచివాలయానికి పెడితే గవర్నర్కు మింగుడుపడటం లేదు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ స్రిప్ట్ ను గవర్నర్ చదివారు. ఆమె వ్యవహారశైలి ప్రజాస్వామ్యానికే పెనుముప్పు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకున్నా అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది. గవర్నర్ బీజేపీ ఏజెంటుగా పనిచేయడం మానేసి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.
-మేడె రాజీవ్సాగర్, టీఎస్ ఫుడ్స్ చైర్మన్