హైదరాబాద్, మే27 (నమస్తే తెలంగాణ) : డీపీఆర్లను వెంటనే ఆమోదించాలని, ఆయా ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కేంద్ర జల్శక్తి శాఖకు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్తో భేటీ అయ్యారు. తెలంగాణ సమస్యలను కేంద్ర జల్శక్తిశాఖకు వివరించారు. రాష్ట్ర అవసరాలకు తగిన విధంగా కృష్ణా నదీ జలాల్లో సమాన నీటివాటాలు కల్పించాలని కోరారు. ఏండ్ల తరబడి తాత్కాలిక ఒప్పందం కొనసాగింపు కుదరదని తేల్చిచెప్పారు. కాల్వల ఆధునికీకరణ కోసం రూ.340 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.