హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు మణిహారంగా నిలువనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)కు అలైన్మెంట్ను ఖరారు చేసిన జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ).. వచ్చే నెల రోజుల్లోగా డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను ఫైనల్ చేసి, భూసేకరణ ప్రక్రియను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తున్నది. ట్రిపుల్ఆర్ మంజూరు కోసం మూడేండ్లకుపైగా కష్టపడిన సీఎం కేసీఆర్.. భూసేకరణలో 50% ఖర్చును భరిస్తామని కేంద్రానికి లిఖిత పూర్వకంగా చెప్పి ఈ ప్రాజెక్టును సాధించారు. ఆ తర్వాత ఎక్కడా రాజకీయ జోక్యానికి తావులేకుండా ఎన్హెచ్ఏఐ తన సాంకేతిక నిబంధనల ప్రకారం స్వతంత్రంగా అలైన్మెంట్ ఖరారు చేసింది. దీంతో 158 కిలోమీటర్ల ఉత్తరభాగాన్ని 7,512 కోట్లతో నిర్మించతలపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇందుకు దాదాపు 4 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ భూ సేకరణకు ఖర్చవుతుందని భావిస్తున్న దాదాపు రూ.3 వేల కోట్లలో సగం మొత్తాన్ని వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోడ్డు నిర్మాణంలో అటవీ ప్రాంతం ఎక్కువగా పోకుండా, వివిధ కాలువలకు, బస్వాపూర్ రిజర్వాయర్కు ఇబ్బంది లేకుండా ఉండేలా యాదాద్రి-భువనగిరి మధ్య నుంచి అలైన్మెంట్ను ఖరారుచేసే వెసులుబాటును ఎన్హెచ్ఏఐకి కల్పించినట్టు ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
సంగారెడ్డి వద్ద ముంబై జాతీయ రహదారి నుంచి చౌటుప్పల్ వరకు విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ 158 కిలో మీటర్ల నిడివితో నిర్మిస్తున్న ట్రిపుల్ఆర్ నిర్మాణం గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్, తూప్రాన్, నర్సాపూర్, హత్నూర, శివ్వంపేట, చౌటకూర్, సంగారెడ్డి, తుర్కపల్లి, యాదాద్రి, వలిగొండ, చౌటుప్పల్, భువనగిరి మండలాల మీదుగా సాగనున్నది. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు కలిసే చోట్ల దాదాపు 8 ఇంటర్ చేంజ్లు నిర్మించనున్నట్టు మంత్రి వేముల తెలిపారు. జిల్లాపరిషత్ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు క్రాస్ అయ్యే చోట్ల అండర్పాస్లు నిర్మిస్తారు. పూర్తిగా గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ ప్రకారం నిర్మించే ట్రిపుల్ఆర్ దాదాపు 100 గ్రామాల గుండా వెళుతుంది. వీటిలో ఏ గ్రామానికీ నష్టం వాటిల్లకుండా ఉండేలా దూరంగా అలైన్మెంట్ ఖరారు చేశారు. సంగారెడ్డి, నర్సాపూర్, తుప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, యాదాద్రి, భువనగిరి, చౌటుప్పల్ పట్టణాల వరకు ఈ రోడ్డును బైపాస్గా నిర్మిస్తారు.
ట్రిపుల్ఆర్ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం.. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్న ఆలోచనతో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. కేంద్రం ప్రకటించిన విధంగా 2025 సెప్టెంబర్ నాటికి ట్రిపుల్ఆర్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.
గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్, తూప్రాన్, నర్సాపూర్, హత్నూర, శివ్వంపేట, చౌటకూర్, సంగారెడ్డి, తుర్కపల్లి, యాదాద్రి, వలిగొండ, చౌటుప్పల్, భువనగిరి
ట్రిపుల్ఆర్కు అనుమతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేశారని, ఈ రోడ్డు ఆయన మాసన పుత్రిక అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కల్పించిన సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.