నర్మెట, డిసెంబర్ 19 : ఏటా వ్యవసాయ బావుల విద్యుత్తు కనెక్షన్కు రూ.360కి బదులు రూ.720 వసూలు చేస్తున్నారంటూ రైతులు విద్యుత్తు అధికారులను నిలదీశారు. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండ గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామంలో జూనియర్ లైన్మెన్ రాజేందర్ వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా నిలిపివేసి పంచాయతీ కార్యాలయ సమీపంలో రైతుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నాడు.
విద్యుత్తు సంస్థ నుంచి వచ్చిన జాబితాలో వార్షిక చార్జీలు రూ.360 ఉండగా రూ.720 వసూలు చేయడాన్ని రైతులు నిలదీశారు. పైఅధికారుల ఆదేశాల మేరకు వసూలు చేస్తున్నట్టు ఆయన చెప్పడంతో రైతులు ఆగ్రహంతో ఏఈ నర్సింహకు సమాచారమిచ్చారు. ఏఈ అక్కడికి రావడంతో రైతులు నిలదీశారు. అదనంగా చెల్లించిన మొత్తాన్ని వచ్చే బిల్లుల్లో సర్దుబాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు నమ్మకపోవడంతో ఏఈ రాతపూర్వకంగా రాసిచ్చారు.