హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దశలవారీగా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను తీసుకొస్తున్న రాష్ట్ర సర్కారు.. శనివారం కొత్తగా 51 సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సౌకర్యాలను కలిగిన ఈ బస్సులకు హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై పూజలు చేసిన అనంతరం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, రవాణశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజుతో కలిసి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆదివారం నుంచి ఈ బస్సులు రోడ్లమీదికి వస్తాయని చెప్పారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ ఆదుకొన్నారని తెలిపారు. కరోనా సమయంలో రోజుకు రూ.10 కోట్ల నష్టం వచ్చినా, సీఎం తీసుకొన్న నిర్ణయాలతో ఆర్టీసీ బతికిందని వెల్లడించారు. ప్రస్తుతం నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయని, భవిష్యత్తులో లాభాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంస్థ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి కార్పొరేషన్కు ఏటా రూ.1,500 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్టు వివరించారు. మరో రూ.1,500 కోట్లతో కౌంటర్ గ్యారంటీ ద్వారా బ్యాంకు రుణ సదుపాయం కల్పించారని పేర్కొన్నారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియోను 80 శాతానికి పెంచేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సూచన మేరకు హైదరాబాద్లో త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని, అందుకు సంబంధించిన కొనుగోలు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావటానికి చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఐదేండ్లలో ఆర్టీసీలో అన్నీ విద్యుత్తు బస్సులే ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, బ్యాంకర్లు, అశోక్ లీల్యాండ్ ప్రతినిధులు, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సిబ్బంది
పాల్గొన్నారు.