హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ ) తొలివిడత సీట్లను అధికారులు శనివారం కేటాయించారు. వివరాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్రావు, గజేంద్రబాబు, టీడీ దినేశ్, హేమంత్కుమార్, డాక్టర్ డీ కుమారస్వామి మీడియాకు వెల్లడించారు. 978 కాలేజీల్లో 4,20,318 సీట్లకుగాను 1,12,683 సీట్లు భర్తీ అయ్యాయి. 59.41 శాతం సీట్లను అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. నాలుగేండ్లుగా వారిదే హవా సాగుతుండగా, ఈ ఏడాది సైతం వారే టాప్లో నిలిచారు. కోర్సులవారీగా కామర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. 37.73 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్సెస్ కోర్సుల్లో విద్యార్థులు చేరారు. 2019లో 174 కోర్సులు ఉండగా, ఇప్పుడు 510 కోర్సులు ఉన్నాయి. తొలిదశలో 51 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. వీటిలో అధికంగా ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి.
నేటి నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్
ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారు రూ.500, ప్రైవేట్ కాలేజీల్లో వచ్చిన వారు రూ.వెయ్యి చెల్లించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటును రిజర్వ్ చేసుకోవచ్చు. దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఆదివారం నుంచి ఈ 22 వరకు కొనసాగనున్నది.
గురుకులాల్లో మిలిగిన సీట్లు..
రాష్ట్రంలోని 53 గురుకుల డిగ్రీ కాలేజీల సీట్లను ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి, ర్యాంకు ఆధారంగానే భర్తీచేస్తున్నారు. మిగులు సీట్లను దోస్త్ ద్వారా ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా భర్తీచేస్తున్నారు. ఇలా ఈ ఏడాది సీట్ల భర్తీ చేపట్టినట్టు కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్ వెల్లడించారు.