Shanthi Swaroop | హైదరాబాద్ : తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం శాంతిస్వరూప్ గుండెపోటుతో యశోదా ఆస్పత్రిలో చేరారు. శాంతిస్వరూప్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
1983 నవంబర్ 14న దూరదర్శన్ చానెల్లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. పదేండ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు ప్రజలకు వినిపించారు. తొలి తెలుగు న్యూస్ రీడర్గా చెరగని ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. శాంతిస్వరూప్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తొలి తరం న్యూస్ రీడర్గా తెలుగు ప్రజలు అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. 1983 నుంచి న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్ తనదైన ముద్ర వేసుకున్నారని రేవంత్ కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని రేవంత్ పేర్కొన్నారు.