Rasamayi Balakishan | గజ్జెకట్టి.. గళంవిప్పి.. జనం గుండెను తట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన నేత రసమయి బాలకిషన్. ఆటాపాటలతో.. మాటల తూటాలు పేలుస్తూ ప్రజలను చైతన్యం చేశారు. సీమాంధ్ర పాలకుల దోపిడీని ఎండగట్టారు. రసమయి పాటలు ఉద్యమ నిప్పులను రాజేశాయి.
లక్షలాది మందిని ఉద్యుక్తులను చేసి, తెలంగాణ ఉద్యమంలో మమేకం చేశాయి. ఎన్నో పాటలను ఏర్చి కూర్చి జనాన్ని కదిలించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గడపగడపకూ ప్రభుత్వ పథకాలను అందజేస్తూ మానకొండూరు మెచ్చిన బిడ్డగా పేరుతెచ్చుకున్నారు.
తెలంగాణ ఉద్యమ గళం. బాలకిషన్ ఉద్యమంలో రసమయిగా గుర్తింపును పొందారు. సాధారణ నిరుపేద దళిత కుటుంబం. ఎంఏ, బీఈడీ, పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2001 నుంచే సీఎం కేసీఆర్ అడుగులో అడుగేసి నడిచారు. పాటతో జనాలను కదిలించడం, తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులను చిత్తు చేయడం ఆయన ప్రత్యేకత. ధూం ధాం కార్యక్రమానికి రూపకల్పన చేసి కాళ్లకు గజ్జెలు కట్టుకుని తెలంగాణ ఉద్యమంలో ఊరూరా తిరిగారు.
తెలంగాణ ఉద్యమానికి పాటలు, మాటల ద్వారా ఊపిరులూదిన రసమయి కళాకారులను కూడగట్టి కేసీఆర్ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారు. 2001 నుంచి తెలంగాణ ధూం ధాం ఫౌండేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం మానకొండూర్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015లో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా కేసీఆర్ నియమించారు. 2018లో మానకొండూర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2021లో రెండోసారి సాంస్కృతిక సారథి చైర్మన్గా నియమితులయ్యారు.
ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మన్ననలను పొందారు. ‘తొలిపొద్దు’ పేరుతో ప్రతి రోజూ ఉదయం గ్రామాల్లో తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి చెక్కులు లబ్ధిదారుల ఇండ్లల్లకే వెళ్లి ‘అవ్వా.. నన్ను కేసీఆర్ సార్ పంపించిండు.. మీకు చెక్కులు ఇవ్వమన్నడు’ అని నోరారా పిలిచి ఆడబిడ్డలకు చెక్కులు అందజేస్తారు. సొంత డబ్బులతో కొన్న చీర సారె పెట్టి వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేను అన్నగా భావించి చెక్కరి కుడుకలు పోయడం.. రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకుంటారు. ఈ కార్యక్రమంతో రసమయి మానకొండూర్ ప్రజలకు అత్యంత చేరువయ్యారు. అందుకే ఆయన మానకొండూర్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ దిశగా ముందుకు సాగుతున్నారు.
శంకరపట్నం మండలం అంబాల్పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ మల్లయ్య తన కూతురు పెండ్లికి రావాలని ఎమ్మెల్యే బాలకిషన్ను ఆహ్వానించారు. వివాహానికి హాజరైన ఆయన అక్కడ జరిగే తంతును చూసి ఆశ్చర్యపోయారు. తనకు బైక్ కొనిస్తానని చెప్తేనే తాళి కడతానని పెండ్లి కొడుకు పట్టుబట్టాడు. పెండ్లికి వచ్చిన వారు ఎందరు చెప్పినా వరుడు వినలేదు. దీంతో ఎమ్మెల్యే బైక్ కొనిస్తానని చెప్పారు. రూ.లక్ష చదివింపుల కింద ఇస్తున్నట్లు చెప్పి, వెంటనే వారికి డబ్బును అందజేశారు. ఓ ఆడబిడ్డ పెండ్లికి అండగా నిలిచారు. అన్నారం గ్రామానికి వెళ్లినప్పుడు ఇల్లు లేని ఓ వృద్ధురాలిని చూసి చలించి పోయారు. నెల రోజుల్లో రేకుల షెడ్డు వేయించి తన మానవత్వాన్ని చూపించారు. జనం గుండెల్లో చోటును సంపాదించుకున్నారు.