డోర్నకల్: ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటేయాలని, ఆషామాషీగా దుర్మార్గులకు ఓటేస్తే ఐదేండ్లు ఏడ్సుక సావాలెనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం డోర్నకల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. యాడీన్ బాపూన్ రామ్రామ్ (మహిళలు, పురుషులు అందరికీ నా నమస్కారం) అంటూ సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కురవి వీరభద్రస్వామి చాలా శక్తి ఉన్న దేవుడని, ఉద్యమం జరిగేటప్పుడు తాను ఇక్కడికి వచ్చి వీరభద్ర స్వామికి మొక్కానని, ‘స్వామి మీ దయవల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే.. నేనొచ్చి మీకు బంగారు మీసాలు సమర్పించుకుంటా’ అని మొక్కుకున్నానని చెప్పారు. స్వామి దయవల్ల తెలంగాణ వచ్చిందని, తాను గూడా మొక్కు చెల్లించుకున్నానని సీఎం తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
‘ముఖ్యంగా నేను మీకు చెప్పదల్చుకున్నది ఏమిటంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చిన దేశాలు అభివృద్ధిలో మనకంటే వేగంగా దూసుకుపోతున్నయ్. మన దేశంలో ఆ పరిస్థితి రావాలె. జనం బాగా ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలె. సరైన పార్టీని గెలిపించుకోవాలె. ప్రజాస్వామ్యంలో మీకు ఉండే ఒకే ఒక్క ఆయుధం మీ ఓటు హక్కు. దాన్ని దుర్మార్గులకు వేస్తే ఐదేండ్లు ఏడ్సుక సావలె. మంచి వాళ్లకు వేస్తే మన తలరాతను మంచిగ రాస్తరు. రాష్ట్రం ఐదేళ్ల భవిష్యత్తును మీ ఓటు నిర్ణయిస్తది. కాబట్టి ఆషామాషీగా ఓటు వేయొద్దు. మీ తండాల్లో, గ్రామాల్లో ఎవరికి ఓటు వేయాలనే దానిపై చర్చ పెట్టండి. అభ్యర్థులు ఎలాంటోళ్లు..? ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలు ఎలాంటివి అనే చర్చ జరగాలె. ఏ అభ్యర్థి ఏం జేసిండు..? ఏ పార్టీ ఏం జేసింది..? అనే అంశాలు చర్చకు రావాలె. ఈ విధంగా చర్చ జరిగితేనే రాయేదో.. రత్నమేదో ఏర్పడుతది’ అన్నారు.
‘బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ సాధన కోసం. తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ కోసం. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో ఏం జరిగింది..? పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది..? అనేది మీరు ఆలోచన చేయాలె. అలా ఆలోచించి ఓటేస్తేనే మంచి ప్రభుత్వం అధికారంలోకి వస్తది. కాంగ్రెస్ హయాంలో రూ.200 పెన్షన్ ఇచ్చేటోళ్లు. మేం వచ్చినంక దాన్ని ముందుగా రూ.1000 చేసినం. తర్వాత రూ.2 వేలకు పెంచుకున్నం. ఇక ముందు రూ.5 వేలకు పెంచుకోబోతున్నం. మేం అధికారంలోకి వచ్చినప్పుడు కరెంటు లేదు. నీళ్లు లేవు. పేరుకే కాలువలు ఉండె తప్ప ఎన్నడూ నీళ్లను కండ్ల జూడలే. డోర్నకల్లో అయితే కాలువల్లో చెట్లు మొలిచినయ్. ఇయ్యన్నీ ఎట్ల బాగు జెయ్యాలె అని జెప్పి బీహార్ నుంచి ఆర్థికవేత్త జీఆర్ రెడ్డిని ఇక్కడికి రప్పించుకున్నం. ఆయన మన తెలంగాణ బిడ్డనే. ఆయనతో కలిసి అనేక మంది ఆర్థికవేత్తలతో చర్చించి ప్రజా క్షేమం కోసం ఓ మార్గం పట్టినం’ అని సీఎం వెల్లడించారు.