హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్లైన్లో వస్తున్న లింకులను నమ్మవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి టీజీఎస్ఆర్టీసీ కసరత్తు ప్రారంభించిందని సజ్జనార్ పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు. అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్నట్టు వివరించారు. అవన్నీ ఫేక్ అని, ఆ లింక్లను నమ్మవద్దని..క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దని ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి చేశారు.