DRCC | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఉత్త చెత్తే కదా అనుకోకండి. చెత్త కూడా కాసులు కురిపిస్తున్నది. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి కూడా ఏటా కోట్లలో ఆదాయం సంపాదించవచ్చని నిరూపిస్తున్నది తెలంగాణ మున్సిపల్ శాఖ. ఈ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ల (డీఆర్సీసీ) ద్వారా రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, మహిళా స్వయం సహాయక సంఘాలు గత సంవత్సర కాలంలో రూ.8.16 కోట్ల ఆదాయం సంపాదించాయంటే ఆశ్చర్యపోకండి.
రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ప్రతిరోజూ 4,316 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 2,240 టన్నుల పొడి చెత్త, 2,076 టన్నుల తడి చెత్త ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 750 టన్నుల పొడి చెత్తను, 1,140 టన్నుల తడి చెత్తను ప్రాసెస్ చేస్తున్నారు. తడి చెత్తను ప్రాసెస్ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 229 కంపోస్ట్ షెడ్లు ఉన్నాయి. వీటి ద్వారా తడి చెత్త నుంచి వర్మి కంపోస్ట్ను తయారుచేస్తున్నారు. దీనిని హరితహారంలో నాటిన మొక్కలకు వినియోగిస్తున్నారు. మిగిలినది రైతులకు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించడం ద్వారా ఏడాది కాలంలో రూ.8.76 కోట్ల ఆదాయాన్ని సమపార్జించారు.
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు బయో మెథనాల్ ప్లాంట్లను 18.50 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటుచేశారు. జీహెచ్ఎంసీలో 5, గ్రేటర్ వరంగల్లో 2.5, సిద్దిపేటలో 10, సిరిసిల్లలో ఒక టన్ను సామర్థ్యంతో బయో మెథనాల్ ప్లాంట్లను నెలకొల్పారు. సిద్దిపేటలో ఆర్గానిక్ వ్యర్థాల నుంచి బయో సీఎన్జీ తయారుచేస్తున్నారు. తద్వారా స్థానిక సంస్థలకు రూ.35 లక్షల ఆదాయం వస్తున్నది. నార్సింగి, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో హెరిటేజ్, విజేత, రిలయన్స్ తదితర సూపర్ మార్కెట్లలో కంపోస్ట్ను విక్రయిస్తున్నారు. ఈ రెండు స్థానిక సంస్థలకు రూ.2.24 లక్షల ఆదాయం వస్తున్నది. చెత్తను శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేయడం, వర్మి కంపోస్ట్ తయారు చేయడం ద్వారా 141 స్థానిక సంస్థలు రూ.9.13 కోట్లు సముపార్జించాయి.
రాష్ట్రంలో 206 డ్రై రిసోర్స్ సెంటర్లు 750 టన్నుల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వీటిలో 87 సెంటర్లను (42%) మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా మహిళా సంఘాల సభ్యులు రూ.6.26 కోట్లు ఆర్జించారు. మరో 119 డీఆర్సీసీలను పట్టణ స్థానిక సంస్థలు నిర్వహిస్తున్నాయి. వీటిద్వారా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.36 లక్షలు, పీర్జాదిగూడలో రూ.18.84 లక్షల ఆదాయాన్ని సంపాదించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రాస్టిక్ గ్రాన్యూల్స్ నుంచి పీవీసీ మ్యానుఫాక్చరింగ్, ప్లాస్టిక్ టైల్స్ తయారు చేయడం ద్వారా రూ.4.80 లక్షలు సంపాదించారు.
మేము చెత్త సేకరించే వారి నుంచి ప్లాస్టిక్, బట్టలు, సీసాలు, ఇనుము తదితర వస్తువులను కొనుగోలు చేస్తాం. వాటిని కంపెనీలకు అమ్ముతాం. నేను, నా భర్త ఇద్దరం కలిసి రోజుకు ఐదారు వేల రూపాయల విలువైన వస్తువులను కొంటాం. నెలకు అన్ని ఖర్చులు పోను రూ.25 వేల వరకు మిగులుతాయి.
– భవాని, డీఆర్సీసీ సెంటర్ నిర్వాహకురాలు, భువనగిరి
రెండేండ్ల నుంచి మరుగుదొడ్లను నిర్వహిస్తున్నా. మాకు మున్సిపాలిటీ డబ్బులు చెల్లిస్తున్నది. ఈ మురుగుదొడ్లను ఎక్కువగా మహిళలు ఉపయోగించుకుంటున్నారు. మేము వారికి ఉచితంగా సౌకర్యాలు అందిస్తున్నాం. బాగా చేస్తున్నానని సీడీఎంఏ సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. వివిధ రాష్ర్టాల్లో స్టడీలో భాగంగా మేం కేరళకు వెళ్లి వచ్చాం. తెలంగాణనే అన్ని విధాలుగా బాగున్నది.
– శారద, జహీరాబాద్