మక్తల్/మక్తల్ టౌన్, మార్చి 13: గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మార్చి నెల నుంచే అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరికైనా జీరో కరెంట్ బిల్లులు రాకపోయినా.. అధికారులు ఇంటి వద్దకు వచ్చి బిల్లులు చెల్లించాలని అడిగినా.. ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలోని సంగంబండ ఆర్ఆర్ సెంటర్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెలిక్యాప్టర్లో ల్యాండ్ అయ్యారు. స్థానిక ఆంజనేయస్వామి, శివాలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డితో కలిసి పూజలు చేశారు. అనంతరం సంగంబండ రిజర్వాయర్ పరిధిలో మిగిలిపోయిన 400 మీటర్ల కెనాల్ తవ్వకానికి భూమిపూజ చేశారు. అక్కడి నుంచి ప్రజా దీవెన సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..
సీఎం రేవంత్ సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని, వెనుకబడిన మక్తల్ ప్రాం తాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీహరి నేతృత్వంలో అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని చెప్పారు. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సంగంబండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల కింద, అలాగే జూరాల బ్యాక్ వాటర్ కింద ముంపునకు గురై భూములు కోల్పోయిన నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మక్తల్-కొడంగల్ పథకంగా మార్చామని, నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, సంగంబండ ముంపు బాధితుల సంఘం అధ్యక్షుడు బాల్రెడ్డి, బీకేర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.