CM KCR | నిజామాబాద్ : బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికుల ఓటు ఇంకో పార్టీకి పడొద్దు అని కేసీఆర్ పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ దేశంలో 17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. దీని గురించి బీడీలు చుట్టే బిడ్డలు ఆలోచించాలి. ప్రభుత్వ వైఖరి, పార్టీ వైఖరి గురించి. పోటీలో ఉన్న పార్టీకి మెదడు ఎలా పని చేస్తదో, ఏమో ఆలోచిస్తదో విచారించాలి. ఏ రాష్ట్రం కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వట్లేదు. బాల్కొండ, ఆర్మూర్ ఈ ప్రాంతాల్లో బీడీ కార్మిక బిడ్డలు ఆలోచించాలి. బీడీ కార్మికులకు రేపు ఐదు వేల పెన్షన్ రాబోతోంది. మీ ఒక్క ఓటు కూడా ఇంకో పార్టీకి పడొద్దు. ఆ విధంగా కార్యకర్తలు ప్రచారం కూడా చేయాలి అని కేసీఆర్ సూచించారు.