వనపర్తి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు, అభివృద్ధిని చూస్తే సీఎం కేసీఆర్ను, మంత్రి నిరంజన్రెడ్డిని వందేండ్లయినా ప్రజలు మరిచిపోరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ(హెచ్) కళాశాల, బీసీ వ్యవసాయ మహిళా కళాశాల తరగతుల ప్రారంభం, జేఎన్టీయూహెచ్ హాస్టల్ భవనానికి శంకుస్థాపన, ఐటీఐ, పీజీ కళాశాల నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, గంగుల కమలాకర్తో కలిసి సబిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మహిళా కళాశాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి సబిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నిరంగాల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. వనపర్తి అభివృద్ధి కండ్లముందు కనిపిస్తున్నదని చెప్పారు. మంత్రి నిరంజన్రెడ్డి ఏది మాట్లాడినా, దాని వెనుక ప్రజల ప్రయోజనం ఉంటుందని కొనియాడారు. రాష్ట్రంలో 1,153 జూనియర్ గురుకుల కళాశాలలు, 83 డిగ్రీ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. రూ.20 లక్షలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చి విద్యార్థులను చదివిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టంచేశారు. రూ.3,500 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. బీసీ మహిళా వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతున్నదని పేర్కొన్నారు. నీళ్ల నిరంజన్రెడ్డిగా పేరు తెచ్చుకొన్న వ్యవసాయ మంత్రికి, ఎన్నో విద్యాసంస్థలు తెచ్చినందుకు ఇప్పుడు మరో పేరు పెట్టాలని చమత్కరించారు.
దేశమంతా బీఆర్ఎస్ గాలి వీస్తున్నదని, కాబోయే ప్రధాని కేసీఆరేనని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బీజేపీ ఎనిమిదేండ్లుగా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. మరో ఏడాదిన్నర వరకు బీజేపీ పీడ విరగడవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఇప్పటికే దివాళా తీసిందని ఎద్దేవాచేశారు. అనంతరం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల పిల్లలకు సీఎం కేసీఆర్ పాలనలో ఉన్నతవిద్య అందుతున్నదని చెప్పారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే బలహీనవర్గాలు విద్యలో వెనుకబాటుకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు 19 బీసీ గురుకులాలు ఉంటే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 310 బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్.. విద్యార్థులకు మేనమామలా రూపాయి ఖర్చు లేకుండా చదివిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కోర్సులను మహిళా డిగ్రీ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసినట్టు వివరించారు.
ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్, ఢిల్లీ వంటి సూదూర ప్రాంతాలకు వెళ్లకుండా కోచింగ్ సెంటర్ను వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసి, ఇక్కడి నుంచి సివిల్ సర్వెంట్స్ను ఎక్కువ మొత్తంలో చూడాలన్నదే తన కల అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గత ఎన్నికల హామీలైన మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు, రహదారుల విస్తరణను నెరవేర్చానని స్పష్టంచేశారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడే కోర్సులు ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు మహిళా బీసీ గురుకుల కళాశాల ఏర్పాటుచేసినట్టు తెలిపారు. వనపర్తిలో విద్యాసంస్థల ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ షేక్యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.