CM KCR | మళ్లీ ఎలక్షన్లు రాంగనే గంటలు పట్టుకొని వస్తరు మేం చేసినం.. ఆరు సందమామలు పెడుతం.. ఏడు సూర్యులను పెడుతం అంటారని సీఎం కేసీఆర్ అన్నారు. కొల్లాపూర్ సింగోటం క్రాస్రోడ్డులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘70 ఏళ్లు ఏడిచిన పాలమూరును పట్టించుకోలేదే. తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్ కాదా? తెలంగాణను ఉద్దరిస్తా.. నేను దత్తత తీసుకున్నానని చెప్పి.. పునాది రాళ్లు పాతింది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు కాదా? ఎవరైనా సహాయం చేశారా? మనం ఏడ్చిన నాడు.. వలసపోయినాడు.. జిల్లా మొత్తం బొంబాయి బతుకులకు ఆలవాలమైన నాడు.. ఆగమాగమైననాడు ఎవరైనా
పట్టించుకున్నాడా? మనం కొట్లాడుకొని.. రాష్ట్రం తెచ్చుకొని ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం.
మళ్లీ ఆగమైతే గోసపడుతాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 50 ఏళ్ల కాంగ్రెస్, 16 ఏళ్ల తెలుగుదేశం పాలనలో మహబూబ్నగర్కు మెడికల్ కాలేజీ ఇచ్చారా? ఇవాళ ఎన్ని మెడికల్ కాలేజీ ఉన్నయ్. ఐదు మెడికల్ కాలేజీలు ఉన్నయ్. నిన్ననే తొమ్మిది కాలేజీలను ప్రారంభించాం. తెలంగాణ ఈ రోజు సంవత్సరానికి 10వేల మందిని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ లేదు. మామూలు స్కూల్ ఫీజంతా చెల్లిస్తే ఎంబీబీఎస్ చదువే పరిస్థితి బిడ్డలకు తీసుకువచ్చాం. పేదింటి పిల్లల కోసం బడుల్లో అల్పహారం అందిస్తున్నాం.
తమిళనాడులో అధ్యయనం చేయించి.. టిఫిన్, మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా ఇవ్వాలని జీవో జారీ చేశాం. వైద్య, విద్య, పవర్ రంగంలో ఎక్కో మొట్టు ఎక్కుతూ ముందుకెళ్తున్నాం. ఈ పురోగమని ఆగవద్దు. దేశంలోనే నంబర్ వన్ తలసరి ఆదాయంతో దూసుకెళ్తున్నాం. ఈ పురోగమనం ఆగవద్దు. అభివృద్ధి ఆగవద్దు. ఇప్పుడు వస్తున్నరు. ఆనాడు ఉద్యమ సమయం, వలసపోయిన నాడు ఎవడూ రాలే. కవి గోరటి వెంకన్న పాటల్లో ‘వాగు ఎండిపాయెరా.. పెద్ద వాగు ఎండిపాయెరా’ అని ఏడ్చాడు. గతంలో దుందుంబి నదిలో దుమ్ము కొట్టుకుపోతుండే.. ఎక్కడ నీళ్ల చుక్క కనిపించేది కాదు. ఇప్పుడు మిషన్ కాకతీయ, చెరువులు బాగు చేసుకున్నాం. వాగులపై చెక్డ్యామ్లు కట్టుకున్నాం.
భూగర్భ జలాలు పెంచుకున్నాం. ఇంకా అభివృద్ధి ముందుకు సాగాలి. అది మీ చేతుల్లోనే ఉంది. ఆగమై పిచ్చోళ్ల మాటలు పట్టుకుంటే.. మళ్లీ మొదటికే వస్తుంది. వైకుంఠ ఆటలో పెద్దపాము మింగినట్లయితది. తస్మాత జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా. అయినదానికే సంతోషపడితే కాదు. ఇంకా బ్రహ్మాండంగా బాగుపడాలి. పాత మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 20లక్షల ఎకరాల్లో నీరుపారాలి.. అది కేసీఆర్ చూడాలి. 20లక్షల ఎకరాల్లో పసిడి పంటలు పండే పాలమూరు జిల్లా కావాలి. అది మన లక్ష్యం. అది సాధించే వరకు, అభివృద్ధి సాధించే వరకు పని చేస్తాం. అప్పటి వరకు మీ అందరి దీవెనలు ఉండాలి.
ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టు మంజూరు చేసుకొని.. ఇప్పుడు నీళ్లు చూస్తేంటే నా జన్మ ధన్యమైంది. తెలంగాణ కోసం పార్లమెంట్లో బిల్లు పాసైన రోజు హృదయం పొంగిపోయిందో.. పాలమూరు పంపు ఆన్ చేసిన తర్వాత నా హృదయం పొంగిపోయింది. సంతోషం అనిపించింది. నేను కోరుకున్నది ఇదే. ఆ నాడు ఎవరూ తేలే. మన తెలంగాణలో తెచ్చుకోవాలనుకున్నాం. తెచ్చుకున్నాం. మనకు జాతి, మతం, కులం లేదు. యావత్ తెలంగాణ బిడ్డలు మనోళ్లే. అందరికీ నీళ్లు రావాలి. బాగుపడాలి. రంగారెడ్డి, వికారాబాద్కు కూడా నీళ్లు రావాలి. ఐకమత్యాన్ని కొనసాగించాలి. నీళ్లు వచ్చాయ్ రిజర్వాయర్లు వచ్చాయ్. అందులో వేల టన్నుల చేపలు పండిస్తాం. అవి మత్స్యకారులు, ముదిరాజ్లకే హక్కులు
ఇస్తాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.