నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 24: ఓట్ల కోసం దండాలు పెట్టే బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దని, ప్రజల కష్టసుఖాల్లో తోడు ఉండేది ఎవరో ఆలోచించి ఓటెయ్యాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నిక ల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా శనివారం మంత్రి పలు వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఒకే మాట, ఒకే బాటలో ఉంటూ ఏక తాటిపై నిలిచే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ దయవల్లనే మండుటెండల్లోనూ చెరువులు మత్త ళ్లు దుంకుతున్నాయని చెప్పారు. సిద్దిపేట ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా 200 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ జోన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
అభివృద్ధిని కాంక్షించే టీఆర్ఎస్కు ఖమ్మం నగర ప్రజలు మరోసారి అండగా నిలువాలని హోంమంత్రి మహమూద్ అలీ, రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. నగరంలోని 23, 25, 37, 38, 39, 40 డివిజన్లలో మంత్రులు టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున రోడ్షో నిర్వహించారు.
సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విపక్షాల మాటలను నమ్మి ప్రజలు అయోమయానికి గురికావొద్దని, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని కొత్తగా మారుస్తామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కొత్తూరులోని 8, 9, 10, 11,12వ వార్డు ల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని 17, 20, 21వ వార్డుల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అచ్చంపేటలోని 1, 2, 9, 10, 13, 14, 19, 20 వార్డుల్లో విప్ గువ్వల బాలరాజు ప్రచారం నిర్వహించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో వరంగల్ నగరం హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ చౌరస్తాలో 46, 64వ డివిజన్ల టీఆర్ఎస్ అభ్యర్థులు మునిగాల సరోజన, ఆవాల రాధికారెడ్డి తరపున శనివారం సాయంత్రం ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వర్ధన్నపేట, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్యలతో కలిసి పల్లా రోడ్షో పాల్గొన్నారు.