జహీరాబాద్, నవంబర్ 22: కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలని సూచించారు. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య విఫలమయ్యారని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం డీకేల మధ్య విభేదాలు ఉండటంతో రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా సాగుతున్నదని వివరించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా దిశగా నడుస్తున్నదని పేర్కొన్నారు. సీఎం పీఠం కోసం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు, కుమ్ములాటలు జరుగుతున్నాయని, ఆ పార్టీ నేతలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి పదవుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మోసపోవద్దని యెడియూరప్ప పిలుపునిచ్చారు. ఈ సభలో కర్ణాటక మాజీ సీఎస్, బీజేపీ నేత రత్నప్రభ, బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్, జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి రాంచందర్, నాయకులు సుమిత్ర, శ్రీనివాస్గౌడ్, జనార్దరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనతో కర్ణాటకలో ప్రభుత్వం దివాలా దిశగా నడుస్తున్నదని ఆ రాష్ట్ర మాజీ సీఎం యెడియూరప్ప పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలంటూ అబద్ధపు హామీలతో కర్ణాటక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. తీరా గెలిచిన తర్వాత అవి అమలు కావడం లేదని చెప్పారు. మొత్తంగా కర్ణాటక సరార్ దివాలా దిశగా నడుస్తున్నదని తెలిపారు. ఇప్పడు కాంగ్రెస్ నేతలు కర్ణాటక తరహాలోనే గ్యారెంటీ పథకాలంటూ తెలంగాణలో ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హామీలను తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవద్దని కోరారు.