కోటపల్లి, నవంబర్ 5: కోట రవీణ ఎంబీబీఎస్ చదువుకునేందుకు సాయం చేయడానికి దాతలు ముందుకొచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన కోట కిష్టయ్య-శంకరమ్మ దంపతుల కుమార్తె రవీణకు నీట్లో 454 మార్కులు (ర్యాంకు 1,22,364) వచ్చాయి. దీంతో మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. అయితే కనీసం ఫీజు కూడా కట్టలేని ఆమె దీనస్థితిపై శనివారం ‘నమస్తే తెలంగాణ’ జిల్లా సంచికలో ‘వైద్య విద్యకు సాయమందించరూ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. ఆమె కుటుంబసభ్యులను హైదరాబాద్ పిలిపించుకొని రూ.లక్ష సాయం అందించారు. కోట రవీణ ఎంబీబీఎస్ చదువుకు రూ.లక్ష సాయం చేసిన బాల్క సుమన్ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు. ‘వెల్డన్ సుమన్’ అంటూ ట్వీట్ చేశారు.
ముందుకొచ్చిన దాతలు
రవీణ వైద్య విద్యకు సాయమందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. హైదరాబాద్లోని మ్యాగ్నా క్లినిక్ వైద్యురాలు శివరంజనీ సంతోష్ అలాట్మెంట్ ఫీజు రూ.12 వేలు, కాలేజీ ఫీజు రూ.27 వేలు మొత్తం రూ.39 వేలు అందజేశారు. కోర్సు పూర్తయ్యే వరకు ఫీజులు కడుతానని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సురభి మెడికల్ కాలేజ్ చైర్మన్ హరిందర్రావ్ రూ.15 వేలు, జగిత్యాలకు చెందిన ప్రముఖ డాక్టర్ అల్లాల శ్రీనివాస్రెడ్డి రూ.12 వేలు, జన్నారానికి చెందిన వినోద్ రూ.5 వేలు, ప్రణీత రూ.3 వేలు, ఇతరుల నుంచి రూ.33,600 అందాయి. దాతలు.. ఎస్బీఐ అకౌంట్ నంబర్ 41298832206 (ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN0018873), ఫోన్ పే నంబర్ 9652668450 ద్వారా సాయం చేయొచ్చు.