యాదాద్రి, మార్చి 9: యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది.బుధవారం నాటికి రూ.15.36 కోట్ల నగదు, మూడు కిలోల పైచిలుకు బంగారం బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ గొప్పకార్యంలో ప్రజలను భాగస్వాములను చేయాలని గతేడాది అక్టోబర్ 19న యాదాద్రిలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అయితే, గత సెప్టెంబర్ 25 నుంచే ఆలయ అధికారులు విరాళాలు సేకరించే పనిలోపడ్డారు. నాటి నుంచి మార్చి 9 వరకు రూ.15,36,50,000 నగదుతోపాటు 3.637 కిలోల మిశ్రమ బంగారం వచ్చింది.
మాజీ ఎమ్మెల్సీ రూ. 54 లక్షల విరాళం
మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్రావు, వీణ దంపతులు బుధవారం యాదాద్రి గర్భాలయ విమాన గోపుర స్వర్ణతాపడానికి రూ.54 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును బాలాలయంలో ఈవో ఎన్ గీతకు వారు అందజేశారు. కాగా, సికింద్రాబాద్కు చెందిన పన్నాల భద్రయ్యవెంకట్రావు రూ.50 వేల విరాళాన్ని స్వామివారికి సమర్పించారు.