ఆర్జీ రావు ట్రస్ట్ చైర్మన్ ఔదార్యం
నాలుగేండ్ల ఫీజు చెల్లిస్తానని హామీ
చేయూతకు మరికొందరు సుముఖత
‘నమస్తే’ కథనానికి స్పందన
పెద్దపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): నిరుపేద కుటుంబానికి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని అంజలి చదువుకు ఆర్థిక భరోసా దొరికింది. ‘చదువుల తల్లికి సాయం చేయరూ’ శీర్షికన శుక్రవారం ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన కథనం పలువురిని కదిలించింది. ఆర్జీరావు ట్రస్ట్ చైర్మన్ బొంత దామోదర్రావు శనివారం అంజలి, ఆమె తల్లి లక్ష్మీబాయితో ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్లోని తార్నాక టీఎస్ఆర్టీసీ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తయ్యేదాకా ఏటా రూ.80 వేల చొప్పున నాలుగేండ్లపాటు చెల్లించేందుకు ముందుకొచ్చారు.
సోమవారం తమ ట్రస్ట్ సిబ్బంది వివరాలు తీసుకొంటారని వెల్లడించారు. కాగా, మంథనికి చెందిన హైదరాబాద్లోని స్పార్క్వీ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పంగనూరి రామేశ్కుమార్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సారయ్య అంజలికి ఫోన్ చేసి సాయం అందిస్తామని భరోసానిచ్చారు. తన బిడ్డ చదువుకు అండగా నిలిచిన ఆర్జీరావు ట్రస్ట్ చైర్మన్ దామోదర్రావుతోపాటు దాతలకు, తమ దయనీయస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’కు లక్ష్మీబాయి కృతజ్ఞతలు తెలిపారు.