Kaleshwaram Project | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మార్గదర్శకాలు జారీ అయ్యాకే కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం’ అని కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. కానీ, ఆ మార్గదర్శకాల అమలు కోసం పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటులో అలసత్వం ప్రదర్శిస్తున్నది. ఎన్డీఎస్ఏ ఆదేశాల అమలుతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు చూడాల్సిన ‘స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్వో)ను పటిష్టం చేయకుండా ఇప్పటికీ డైవర్షన్ ఉద్యోగులతోనే సరిపెడుతున్నది. వీరిలో ఇద్దరు కీలక అధికారులు వచ్చే మేలోనే విరమణ పొందనుండగా నియామకాలపై నెలక్రితమే ఎన్డీఎస్ఏ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరిని నియమించాలనేదానిపై సిఫార్సులు కూడా చేసింది. అయినా ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగుకూడా వేయకుండా ప్రాజెక్టు పునరుద్ధరణపై అశ్రద్ధ చూపుతున్నది.
ప్రాజెక్టుల నిర్వహణ, భద్రత కోసం డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 మేరకు కేంద్ర ప్రభుత్వం నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా డ్యామ్ల భద్రతను పర్యవేక్షించేందుకు ‘ఎన్డీఎస్ఏ’ను ప్రత్యేకంగా నెలకొల్పింది. ఆనకట్ట భద్రత విధానాల రూపకల్పన, నిబంధనల సిఫార్సు కోసం వివిధ విభాగాల్లో నిపుణులు, రాష్ర్టాల అధికారులతో కలిపి ‘డ్యామ్ సేఫ్టీ జాతీయ కమిటీ’ని ఏర్పాటు చేసింది. జాతీయ ప్రాజెక్టుల భద్రత ప్రమాణాలను ఏటా రెండు సార్లు నిర్ధారించేందుకు ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్స్’ను ఏర్పాటు చేయాలి. ఇదే తరహా రాష్ర్టాలు సైతం తమ పరిధిలోని డ్యామ్ల భద్రత పర్యవేక్షణ, ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల అమలు కోసం ఎస్డీఎస్వోలను ఏర్పాటు చేయాలి. సలహాలు, సూచనలు, సిఫార్సుల కోసం ‘స్టేట్ డ్యామ్ సేఫ్టీ కమిటీ’లను, భద్రత, ఆడిట్ కోసం ‘స్టేట్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’ను నెలకొల్పాలి. ఇలా చట్టంలో మొత్తంగా ఎస్డీఎస్వోలదే కీలక భూమిక. ఏదైనా ప్రాజెక్టులో లోపాలను గుర్తిస్తే వాటి పునరుద్ధరణ బాధ్యత కూడా వీటిదే. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలు, ఆమోదం, పర్యవేక్షణలోనే పనులు కొనసాగించాలి. ఇందుకోసం డ్యామ్ సేఫ్టీ యాక్ట్, 2021లోని సెక్షన్ 21 ప్రకారం ఎస్డీఎస్వోలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.
చట్టాన్ని అనుసరిస్తూ ఎస్డీఎస్వోను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. చీఫ్ ఇంజినీర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఇద్దరు ఈఈలు, నలుగురు డీఈఈలు, ఎనిమిది మంది ఏఈఈలు, కార్యాలయం కోసం ఒక డీఈఈ, డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ), ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 10 మంది ఆఫీస్ సబార్డినేట్లతో ఎస్డీఎస్వోను నెలకొల్పాలి. దీని హెడ్ అకౌంట్ను కూడా ప్రత్యేకంగా నిర్వహించాలి. ఈ విభాగం డ్యామ్ల భద్రతను పర్యవేక్షిస్తూనే, క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు శిక్షణ కూడా ఇవ్వాలి. చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే అప్పటికప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితి లేక అప్పటి ప్రభుత్వం తాత్కాలికంగా కమిటీ ఏర్పాటు చేసింది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం కింద ఉన్న అధికారులనే డైవర్షన్ చేసి ఎస్డీఎస్వో బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికీ ఆ అధికారులతోనే ఎస్డీఎస్వో కొనసాగుతున్నది. ఈఎన్సీ చైర్మన్గా, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఈఎన్సీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజినీర్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్, రామగుండం ఈఎన్సీ సభ్యులుగా ‘స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ’ని గత ప్రభుత్వం నియమించింది. ఇందులోనూ మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ చీఫ్ ఇంజినీర్లు, ఓయూ, జేఎన్టీయూల నుంచి హైడ్రాలజీ, డ్యామ్ డిజైన్ నిపుణులు, సీడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ, పవర్ తదితర రంగాల నిపుణులను నియమించాల్సి ఉంది. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల మేరకే మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరిస్తామని నాలుగు నెలలుగా చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికీ ఎస్డీఎస్వో, ఎస్డీఎస్సీలపై దృష్టి పెట్టక వాటిని పూర్తిస్థాయిలో నియమించలేదు.
జలాశయాల నిఘా, తనిఖీ, ఆపరేషన్, నిర్వహణ, రక్షణ, ప్రమాదాలకు బాధ్యులను నిర్ధారిస్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫారసులు- 2023 పేరిట కేంద్రం నెల క్రితమే కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఆనకట్టకు సంబంధించి డిజిటల్ లాగ్బుక్లు, డాటాబేస్ను ప్రతి రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ తప్పక నిర్వహించాలి. నిర్దేశిత ఆనకట్ట ఎక్కడుంది? ఎప్పుడు, ఎందుకోసం, ఏ నదిపై? ఎవరు, ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆపరేషన్ ప్రోటోకాల్ ఇలా ప్రతి సాంకేతిక అంశాన్ని డిజిటల్ రూపంలో ఎస్డీఎస్వోనే రూపొందించాలి. ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్, నిర్వహణ, క్రమం తప్పకుండా తనిఖీలు, మరమ్మతులు ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు పూర్తిచేశారు? తదితర వివరాల డిజిటల్ రికార్డులను నిర్వహించాలి. ప్రాజెక్టులో ఎప్పుడు, ఎలాంటి ప్రమాదం జరిగింది? ఏ నిర్మా ణం దెబ్బతిన్నది? సీపేజీ తీరు, లీకేజీలు, భూకంపాలు, మట్టికోతకు గురవడం వంటివి ఏమైనా ఉన్నాయా? గుర్తించి ఏ అధికారి, ఏ రోజున తనిఖీ చేశారు? ఏం పరిశీలించారు? ప్రమాద నివారణకు చేసిన ప్రతిపాదనలు ఏమిటి? నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యాయా? వంటి వివరాలను కూడా క్రోడీకరించాలి. ప్రభుత్వం పూ ర్తిస్థాయి ఎస్డీఎస్వోలను నియమించకపోవడంతో ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల అమలు కొనసాగడం లేదు.
ఎస్డీఎస్వోలో ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు కీలకభూమిక పోషిస్తున్నారు. సీఈ ప్రమిల, ఎస్ఈ మురళీకృష్ణ సైతం ఆది నుంచీ సేవలందిస్తున్నారు. వారిలో నాగేందర్రావు, మురళీకృష్ణ ఇద్దరూ వచ్చే నెలలో విరమణ పొందనున్నారు. ఆనకట్టల భద్రత పర్యవేక్షణకు సంబంధించి నియమించాల్సిన అధికారుల అర్హతలను తెలుపడంతోపాటు, ప్రమాదాలకు బాధ్యత వహించాల్సిన అధికారులకు సంబంధించిన నిబంధనలను కూడా ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. ఆనకట్టల భద్రతకు చీఫ్ ఇంజినీర్ మొదలు దిగువ జేఈల వరకు బాధ్యులను చేయడంతోపాటు, సదరు అధికారులకు ఉండాల్సిన అర్హతలు, అనుభవం, పొందాల్సిన శిక్షణపైనా మార్గదర్శకాలు ఇచ్చింది. నిర్దేశిత డ్యామ్ల పరిశోధన, రూపకల్పన, నిర్మాణంలో పాటించాల్సిన నిబంధనలు, అందుకోసం నియమించే ఇంజినీర్ల అర్హతలను సైతం నిర్దేశించింది. కానీ, భారీ ప్రాజెక్టుల్లో పనిచేసి, విద్యార్హతలేనివారు కొందరు, విద్యార్హతలున్నా భారీ ప్రాజెక్టుల్లో అనుభవం లేనివారు కొందరు ఉండడంతో కమిటీ ఏర్పాటుపై రాష్ట్ర సర్కారు ఒక్క అడుగుకూడా ముందుకు వేయడం లేదు. మరి ఈ పరిస్థితిలో ఎన్డీఎస్ఏ మార్గదర్శలు అమలు చేయాల్సిన ఎస్డీఎస్వోలు పటిష్టంగా లేకపోవడంతో ‘కాళేశ్వరం’ పునరుద్ధరణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.